విద్యుత్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరెంటు కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన పనులు, చెల్లింపులపై చర్చించారు. అధిక రేట్లకు విద్యుత్ ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన సంబంధింత అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2, 636 కోట్లు నష్టం వాటిల్లిందని ఈ సమీక్షలో వెల్లడైంది. ఈ డబ్బును కంపెనీల నుంచి రికవరీ చేయాలని సీఎం ఆదేశించారు.
కంపెనీలు దారికి రాకుంటే ఒప్పందాలు రద్దు చేసుకోవాలని జగన్ ఆదేశించారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, ఈ అవినీతిని తేల్చేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అవసరమైతే ఉన్నత అధికారులు, అప్పటి సీఎం, మంత్రిపై న్యాయపరమైన చర్యలకు కూడా వెనుకాడమని జగన్ హెచ్చరించారు. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి కొద్ది రోజుల క్రితం ఇదే విషయం మీద కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఒక లేఖ రాశారు.
సంబంధిత శాఖ రుజువులు లేకుండా విద్యుత్ కొనుగోళ్ళలో అవకతవకలు అంటూ ముందుకు వెళ్తే అది పెట్టుబడిదారులను ఇబ్బంది పెట్టినట్టే అని, దాని వల్ల రాష్ట్రానికీ దేశానికీ కూడా నష్టమని, విద్యుత్ కొనుగోళ్లన్నీ పారదర్శకంగానే జరిగాయని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ఈ నిర్ణయం వల్ల జరిగే పరిణామాలు ఆయనకు తెలపాలని చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. అయినా జగన్ ఈ విషయంలో ముందుకు వెళ్ళడానికే నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది.