సాక్షిలో కూర్చునే ఏకిపారేసారుగా!జగన్ సొంత మీడియా సంస్థ అయినటువంటి సాక్షిలో ఏపీ ప్రభుత్వానికి గానీ, జగన్ పైన గానీ ఎలాంటి వ్యతిరేక భావ ప్రకటనలు ఉండవు. కనీసం విమర్శించిన వారి పేర్లు గానీ, ఆ విమర్శలు కూడా చోటు దక్కనంతగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు తమ విధులు నిర్వహిస్తుంటాయి.

అలాగే ఏపీ సర్కార్ నుండి కూడా అంతే సహాయ సహకారాలు సాక్షి మీడియాకు గత రెండేళ్లుగా వెళ్తున్న వైనం బహిరంగమే. కేవలం సాక్షిలో మాత్రమే ప్రభుత్వ యాడ్స్ మరియు ప్రత్యేకమైన పేజీలను ముద్రించే విధంగా ప్రకటనలు గడిచిన 30 మాసాలుగా జరుగుతూనే ఉంది.

ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ ఏపీ ప్రజల సొమ్ములు సాక్షికి కట్టపెడుతున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా, ఒక్క వార్త కూడా సాక్షిలో ప్రసారం కాదు. కానీ బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్ధసారధి ఏకంగా సాక్షి మీడియాలో కూర్చునే జగన్ చేపట్టిన కొత్త పధకంపై విమర్శల వర్షం కురిపించారు.

సాక్షిలో కేఎస్ఆర్ లైవ్ షోలో పాల్గొన్న పార్ధసారధి, ఇటీవల జగన్ ప్రారంభించిన ‘వన్ టైం సెటిల్మెంట్’ పధకాన్ని ఏకిపారేశారు. నాటి ఎన్టీఆర్ ఇచ్చిన ‘ఎన్టీఆర్ ఇళ్ళ’కు నేడు రిజిష్ట్రేషన్స్ చేయడం ఏంటి? అలాగే వైఎస్సార్ ఇచ్చిన ‘ఇందిరమ్మ ఇళ్ల’కు ఇవాళ రిజిష్ట్రేషన్స్ ఏంటి?

ఒకవేళ చేయదలుచుకుంటే ఉచితంగా చేసి పేదలకు ఇవ్వాలి గానీ, పదివేలు ఎందుకు? అసలు జగన్ చేసిన ‘నవరత్నాలు’ హామీలో భాగంగా పేదలందరికీ ఉచితముగా ఇళ్ల పంపిణీ చేస్తామని అన్నారు. కానీ రెండేళ్లు గడిచినా ఒక్క ఇల్లు అయినా పంచారా? ఇన్నాళ్లు ఏం చేస్తున్నారు?

ఇలా గ్యాప్ లేకుండా పార్ధసారధి కురిపించిన విమర్శల వర్షానికి బిత్తరపోయేలా చూడడం షో నిర్వాహకుని వంతయ్యింది. సహజంగా ఈ షోలో ఎప్పుడూ ‘జగన్ పై భజన’ తప్ప, విమర్శలకు తావిచ్చేవారు కాదు. అలాంటిది జగన్ నిర్ణయాన్ని ఎత్తిచూపడంతో తెలుగు తమ్ముళ్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.