YS-Jagan-Government-Welfare-Schemesగత మూడేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ రాజ్యం నడుస్తోంది. నెల తిరిగేసరికి సిఎం జగన్ బటన్ నొక్కి ఏదో ఓ వర్గానికి వందల కోట్లు ఇస్తునే ఉన్నారు. మరో రెండేళ్ళు ఇస్తూనే ఉంటారు. అయితే ఈ మూడేళ్ళలో ఇచ్చిన సొమ్ముతో లబ్దిదారుల జీవితాలు మారిపోయాయా? వారి సమస్యలు తీరిపోయాయా?వారి జీవన ప్రమాణాలు పెరిగాయా?అని ప్రశ్నించుకొంటే లేదనే అర్దమవుతుంది.

గత రెండేళ్ళుగా ఈ పధకాల ద్వారా సొమ్ము అందుకొన్నవారే మళ్ళీ ఈ ఏడాది, రాబోయే రెండేళ్ళు కూడా సొమ్ము ఆశిస్తున్నారంటే అర్దం ఏమిటి? వారి పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదనే కదా? అయినా ఓ పది పదిహేనువేల రూపాయలతో ప్రజల జీవితాలు మారిపోతాయనుకొంటే దేశంలో ఇంతమంది పేదలు ఉండేవారు కారు… స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ళ తరువాత కూడా దేశంలో ఇంత పేదరికం ఉండేదే కాదు.

కనుక సంక్షేమ పధకాలు దయనీయ పరిస్థితులలో ఉన్న వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, రోగులు తదితరులను ఆదుకోవడానికి మాత్రమే వినియోగించాలి తప్ప ఓట్ల కోసం అవసరమున్నవారికీ లేనివారికీ పప్పు బెల్లాలా పంచిపెట్టడం సరికాదు.

ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలు దివాళా తీస్తున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యం ఆర్ధిక మాంద్యంలో చిక్కుకోబోతోందని హెచ్చరికలు వినబడుతున్నాయి. పక్కనే ధనిక రాష్ట్రమని విర్రవీగిన కేసీఆర్‌ నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు.

ఈ పరిణామాలన్నీ చూస్తూ కూడా జగన్ ప్రభుత్వం ఓట్ల కోసం, వచ్చే ఎన్నికలలో మళ్ళీ అధికారంలోకి రావడం కోసం విచ్చలవిడిగా అప్పులు చేస్తూ, సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచిపెడుతుంటే రాష్ట్ర భవిష్యత్ ఏమౌతుంది?

ఇప్పటికే జగన్ ప్రభుత్వం నెలనెలా కేంద్ర ప్రభుత్వాన్ని బ్రతిమలాడుకొని నిధులు, అప్పులు తెచ్చుకొంటూ భారంగా రోజులు గడుపుతోంది. ఇదే విదంగా మరో రెండేళ్ళు అప్పులు చేసి, సంక్షేమ పధకాలు అమలుచేసి మళ్ళీ వైసీపీయే అధికారంలోకి వచ్చినా అప్పుడు ఎక్కడి నుంచి డబ్బు అప్పు పుడుతుంది?

ఒకవేళ వచ్చే ఎన్నికలలో మళ్ళీ వైసీపీ గెలిచి జగన్‌ ముఖ్యమంత్రి అయినా కురుక్షేత్ర మహాసంగ్రామం తరువాత పాండవులు ఎదుర్కొన్న పరిస్థితే ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్ధికంగా పూర్తిగా మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి చేస్తారు?సాధిస్తారో ఆలోచించుకోవాలి.

సంక్షేమ పధకాలతో చేతిలో డబ్బులు పడుతున్నందుకు చాలా సంతోషిస్తున్న ప్రజలు కూడా ఈ 10-15 వేల రూపాయలతో తమ జీవితాలలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా?అని ఆలోచించుకోవడం మంచిది. ఆ చిన్నపాటి సొమ్ము కోసం జీవితాంతం ఈ ధరల పెరుగుదలను, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్నును భరించ వచ్చా లేదా? రాష్ట్రంలో రోడ్లు, విద్యుత్, మౌలికసదుపాయాలు లేకపోయినా భరించవచ్చా లేదా?ఉద్యోగాలు, ఉపాధి లేకపోయినా సంక్షేమ పధకాలతో జీవించేయవచ్చా లేదా?అని ప్రజలు కూడా ఆలోచించుకోవాలి.