కరోనా విపత్తు వచ్చిన నాటి నుండి జగన్ ప్రభుత్వానికి కష్టకాలం మొదలయ్యింది. సహజంగా మీడియాకు దూరంగా ఉండే ముఖ్యమంత్రి.. మీడియా ముందుకు వచ్చి అభాసుపాలు అయ్యారు. ఆ తరువాత వాలంటీర్ల వ్యవస్థ వల్ల రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉంటున్నాయని చెప్పుకోవడం ప్రారంభించినా కేసులు పెరిగిపోవడంతో అది కూడా కుదరలేదు.
ఆ తరువాత ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేసే డాక్టర్లు, ఇతర సిబ్బందికి మాస్కులు, ఇతర రక్షణ సామగ్రి ఇవ్వడంలో విఫలం అవుతుందనే విమర్శలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మొన్న అటువంటి విమర్శలతో నర్సీపట్నంలోని ఒక డాక్టర్ ఒక వీడియో విడుదల చేస్తే… అది ప్రకంపనలు సృష్టించింది.
అయితే సదరు డాక్టర్ కి టీడీపీ ముద్ర వేసి సస్పెండ్ చేశారు. తాజాగా ఇటువంటి విమర్శలే చేశారు నగరి మునిసిపల్ కమీషనర్ వెంకట రామి రెడ్డి. తమకు ప్రభుత్వం నుండి కనీస సాయం అందడం లేదని, ఒక్క రూపాయి కూడా రావడం లేదని ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అయితే ప్రభుత్వం ఆయన్ని కూడా సస్పెండ్ చేసింది.
ఇటువంటి చర్యలతో ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అనుకుంటే అది పొరపాటే. రక్షణ సామగ్రి కొరత ను తీర్చకుండా ఆ విషయాన్ని బయటకు రాకుండా రాజకీయ రంగు పులిమితే ప్రభుత్వం తో పాటు రాష్ట్రానికి నష్టమే. ఇంతటి కీలకమైన సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న వైద్య సిబ్బందిని రక్షించుకోలేకపోతే అది మనకే ప్రమాదం.