కరోనా రక్కసి కోరలు చాపుతున్న తరుణంలో పదవ తరగతి పరీక్షలు రద్దు చెయ్యాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోరాడుతున్నారు. లోకేష్ కు క్రెడిట్ రాకూడదు అనే పట్టుదలతో ప్రభుత్వం కూడా పరిస్థితులు అనుకూలించకపోయినా పరీక్షలు జరపాలనే పట్టుదలతోనే ఉంది.
పరీక్షల వాయిదాపై విద్యార్థుల తల్లిందండ్రులతో లోకేశ్ సోమవారం జూమ్ లో సమావేశమయ్యారు. ఏపీలో 20 నిమిషాలకు ఒకరు కరోనాతో చనిపోతున్నారని…ఇప్పటికి 100 మంది టీచర్లు కరోనాతో చనిపోయారన్నారు. పరీక్షల వాయిదాపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గవర్నర్కి లేఖ కూడా రాసినట్లు ఆయన చెప్పారు.
“పరీక్షల విషయంలో సీఎం జగన్ ఇకనైనా ఇగోను వదిలిపెట్టాలి. దీని కారణంగా లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పరీక్షలు సూపర్ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉంది. పరీక్షలు రద్దుచేసి మంచి మేనమామ అనిపించుకుంటారో.. కంసమామ అనిపించుకుంటారో జగన్ ఇష్టం’’ అని లోకేష్ అన్నారు.
మరోవైపు… ఏపీలో కేసులు తక్కువగా ఉన్న సమయంలో ఎన్నికలు పెడతామంటే నిమ్మగడ్డ మా ప్రాణాలకు గారంటీ ఇస్తారా అంటూ కోర్టుకు కూడా వెళ్లాయి ఉద్యోగ సంఘాలు. ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు నిర్వహణపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీచర్స్ ఎమ్మెల్సీలు ఏమైనా స్పందించారా? అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.