ఆంధ్రప్రదేశ్ లోని కొత్త ప్రభుత్వాన్ని నిధుల కటకట ఇబ్బంది పడుతుంది. ఉన్న నిధులు అప్పులు జీతాలు, పెన్షన్లకే సరిపోవడం లేదు. ఇటువంటి తరుణంలో జగన్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటిస్తూ పోతుంది. దీనితో ఖజానా మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదు అలాగే కేంద్రం సాయం చేస్తుందన్న ఆశలు కూడా లేవు.
ఈ తరుణంలో నిధుల సమీకరణ కోసం రెండెకరాల భూమిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. నిధుల సమీకరణ కోసం నిరుపయోగంగా ఉన్న రెండెకరాల భూమిని విక్రయించే దిశగా చర్యలు చేపట్టింది. స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని.. బూత్ బంగ్లాను తలపిస్తోన్న భవనాలను విక్రయించే అవకాశం ఉంది.
అధునాతన భవనాల కోసం.. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇది అనువైన ప్రదేశమని అధికారులు అంటున్నారు. ఈ స్థలం అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. 200 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా. ప్రభుత్వం పంచే పప్పు బెల్లాల కోసం ప్రభుత్వ భూములు అమ్ముకునే ప్రయత్నాలు చేస్తే అది చాలా ప్రమాదకమైన నిర్ణయం.
ప్రభుత్వ స్థలాల అమ్మకాలు అంటూ మొదలయ్యాయి అంటే అవి ఆగే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలకు, కొత్త కంపెనీలకు భూముల అవసరం చాలా ఉంటుంది. భవిష్యత్తు అవసరాలను మరచి తాత్కాలిక పథకాల పందేరం కోసం భూములు, ఆస్తులు అమ్మితే అది ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చేది కాదు.