23% శాతం ఫిట్ మెంట్ ప్రకటన ఏపీ సర్కార్ నుండి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల ముఖచిత్రాలు ఏమిటి? అంటే… ఉద్యోగ సంఘ నేత అయిన బండి శ్రీనివాసరావు అయితే వైసీపీ కార్యకర్తల మాదిరి ప్రసంగాలు ఇస్తూ సీఎం జగన్ మరియు సలహాదారుడు సజ్జలకు నీరాజనాలు పలికారు.
జగన్ ఓ కృష్ణదేవరాయలు… సజ్జల ఓ తిమ్మరుసు… అని పొగడ్తలతో ముంచేయడమే కాకుండా, గత ప్రభుత్వం దిగిపోవడానికి కారణం తామేనని, ఈ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుంటామని, నవరత్నాలన్నీ కూడా జనాల్లోకి వెళ్లే విధంగా మేము చొరవ తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
ఇదంతా కూడా 23 శాతం ఫిట్ మెంట్ ప్రకటన తరువాత ప్రభుత్వ సమక్షంలో పలికిన పలుకులు. మరి ఇదే బండి శ్రీనివాసరావు వ్యక్తిగతంగా మీడియాతో మాట్లాడినపుడు చెప్పిన మాటలేంటి? అంటే… ‘మా ఉద్యోగులకు తాము సర్ది చెప్పుకుంటాం’ అంటూ ఓ కీలక వ్యాఖ్య చేసారు.
దీంతో తేలిన అసలు విషయం ఏమిటంటే… ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో బండి లాంటి ప్రభుత్వాన్ని మోయడానికి సిద్ధపడ్డారు గానీ, ఉద్యోగులంతా సంతృప్తితో లేరని, సర్కార్ చర్యలతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని తేలింది. దీనికి తోడు వాట్సాప్ మరియు టెలిగ్రామ్ లలో ఉద్యోగుల జరిపిన సంభాషణ అంటూ అనేక స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ఈ స్క్రీన్ షాట్స్ లో వాస్తవాలు ఎంతన్నది పక్కనపెడితే, నాడు 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించిన తదుపరి కూడా టిడిపి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసిన ఉద్యోగులు, నేడు 23 శాతం ఫిట్ మెంట్ తో జగన్ సర్కార్ ను నిజంగా నెత్తిన పెట్టుకుంటారా? అనేది ప్రశ్నార్ధకంగా మిగిలింది.
బహుశా అప్పుడు 43 శాతం విలువ ఉద్యోగులకు పట్టలేదేమో గానీ, ఇప్పుడు మాత్రం ఉద్యోగులందరికీ నాటి టిడిపి సర్కార్ ఇచ్చిన విలువ తెలిసి వస్తోంది. చివరికి టిడిపి సర్కార్ కు దక్కిన 23 ఎమ్మెల్యే సీట్ల సంఖ్యే ఫిట్ మెంట్ (23 శాతం) సంఖ్యకు సరిపోయిందని, నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.