ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుండీ లాక్ డౌన్ ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది అనుకున్నారు. మొదటి దశ లాక్ డౌన్ పూర్తి కాగానే కేవలం రెడ్ జోన్లకు మాత్రమే లాక్ డౌన్ పరిమితం చెయ్యాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పారు. అయితే అది అప్పట్లో అమలు కాలేదు.
ఇప్పుడు రెండో దశ లాక్ డౌన్ పూర్తి కాగానే రెడ్ జోన్లలో మాత్రమే లాక్ డౌన్ పొడిగించి, గ్రీన్ జోన్లలో మినహాయింపు ఇవ్వాలని కేంద్ర యోచిస్తున్నట్టు సమాచారం. ఆరంజ్ జోన్లలో మాత్రం కొన్ని సడలింపులతో లాక్ డౌన్ ఉంటుంది. ఈ తరుణం కేంద్ర ఆరోగ్య శాఖ దేశంలోని గ్రీన్, ఆరంజ్, రెడ్ జోన్ల వివరాలను ప్రకటించింది.
తెలంగాణలోని ఆరు జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన కేంద్రం.. 18 జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా, 9 జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించింది. కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాలను కేంద్రం రెడ్ జోన్లుగా ప్రకటించింది.
అలాగే ఏపీలో రెడ్ జోన్లో జాబితాలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కేవలం విజయనగరం మాత్రమే గ్రీన్ జోన్ గా ఉంది. తెలంగాణాలో ని 33 జిల్లాలో తొమ్మిది గ్రీన్ జోన్ జిల్లాలు కాగా… ఏపీలో ని పదమూడు జిల్లాలలో కేవలం ఒకటి మాత్రమే.
ఏపీలో జిల్లాల విభజన జరిగి ఉంటే గ్రీన్ జోన్ జిల్లాలు ఎక్కువగా ఉండేవి. ప్రతి పార్లమెంట్ నియోకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని జగన్ ఎన్నికల ముందు ప్రకటించినా… ఆ ప్రక్రియకు కొంత కసరత్తు జరిగినా జిల్లాల విభజన జరగలేదు. జరిగి ఉంటే జగన్ కోరుకున్నట్టు మరిన్ని చోట్ల లాక్ డౌన్ సంపూర్ణంగా ఎత్తివేసే అవకాశం ఉండేది.