గత నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన లోటస్ పాండ్ ఇంట్లో కలిసి కేసీఆర్ స్థాపించిన ఫెడరల్ ఫ్రంట్ లోని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు ఆంధ్రకు ఉన్న 25 ఎంపీలు సరిపోవడం లేదు కాబట్టి తెలంగాణకు ఉన్న 17 ఎంపీలు తోడైతే ఆ బలంతో హోదా సాధించుకోవచ్చు అని జగన్ అన్నారు. అయితే తాము ఫెడరల్ ఫ్రంట్ లో చేరుతున్న దానిపై జగన్ క్లారిటీ ఇవ్వలేదు.
తమ పార్టీ నేతలతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని జగన్ చెప్పారు. ఆ తరువాత ఆ ఊసు ఎత్తలేదు. ఆ మధ్య ఈ నెల 14న అమరావతిలోని జగన్ ఇంటి గృహప్రవేశానికి కేసీఆర్ ముఖ్య అతిధిగా వస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇరు వర్గాలు దీనిపై స్పందించలేదు. ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో అని వైకాపా ఒక లీక్ ఇచ్చిందని, ప్రజల అభిప్రాయం విరుద్ధంగా ఉండటంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే కేసీఆర్ ఆంధ్ర వచ్చి జగన్ ను కలవడం అనేది జరగకపోవచ్చు.
ఈ నెల 14న కేసీఆర్ విశాఖపట్నం వస్తున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో వచ్చేనెల 14న జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారు. అక్కడ జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొంటారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. సహజంగా ఆధ్యాత్మిక టూర్లలో కేసీఆర్ రాజకీయ వ్యాఖ్యలు చెయ్యరు కాబట్టి ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఉండకపోవచ్చు. అదే రోజు జగన్ అమరావతి ఇంటి గృహప్రవేశం జరిగిపోతే ఫెడరల్ ఫ్రంట్ గురించి జగన్ పునరాలోచన చేస్తున్నట్టే.