29 సార్లు ఢిల్లీ వెళ్లి అభ్యర్ధించాను అయినా కేంద్రం మనసు కరగలేదు అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే వారు. దానిని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఏం లాభం అక్కడ కేంద్ర పెద్దలకు టీటీడీ శాలువాలు, ప్రసాదాలు, వేంకటేశ్వరస్వామి ప్రతిమలు ఇచ్చి రావడం తప్ప అంటూ చంద్రబాబుని ఎద్దేవా చేసేవారు. ఇప్పటివరకూ జగన్ ఒకటిరెండు సార్లు ఢిల్లీ వెళ్లి ఇదే పని చేసొచ్చారని చంద్రబాబు సైతం అసెంబ్లీలో ఆరోపించారు.
తాజాగా ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఆయన ఆగస్టు 6, 7 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర సమస్యలు, పెండింగ్లో ఉన్న అంశాలను వివరించడంతోపాటు రాష్ట్రానికి ఉదారంగా ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు. వైఎస్ జగన్ ప్రధానితోపాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తెస్తారు.
వీరితోపాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులను కూడా సీఎం వైఎస్ జగన్ కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండటంతో మనం ఏమీ చెయ్యలేం వారిని ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ కనిపించినప్పుడల్లా అడగడం తప్ప అని ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పడంతో నాలుగు సూట్ కేసుల టీటీడీ శాలువాలు, ప్రతిమలతో ఢిల్లీ బయల్దేరారు అంటూ సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు.