కాంగ్రెస్ అధినేత రాహుల్ గాందీ, టిడిపి అద్యక్షుడు చంద్రబాబు నాయుడు కలవడంపై ప్రతిపక్ష జగన్ స్పందించారు. చంద్రబాబుకు పచ్చి అవకాశవాది అని, ఆయనకు ఎలాంటి నైతిక విలువలు లేవని ఆయన అన్నారు. 1956 నవంబర్ 1వ తేదీన అవిభక్త ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజే.. రాష్ట్రాన్ని ముక్కలుగా విడగొట్టిన శక్తులతో చంద్రబాబు చేతులు కలిపి దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు.
చంద్రబాబునాయుడు అవసరమైనప్పుడు బీజేపీని వాడుకున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో వారు రాష్ట్రానికి ద్రోహం చేసినా కలిసి కాపురం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలుగా విడగొట్టిన కాంగ్రెస్నూ ఇప్పుడు వాడుకుంటారు. మళ్లీ అవసరమనుకున్నపుడు బీజేపీతో జతకడతారేమో. ఆయనకు సిద్ధాంతాలు, ఎలాంటి విలువలు గానీ, శషభిషలు గానీ ఉండవనేందుకు ఆయన వెనుక ఉన్న చరిత్రే సాక్ష్యంగా నిలుస్తుంది అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
అయితే గురువింద గింజకు తన నలుపు తనకు తెలియదు అన్నట్టు ఉంది జగన్ వాలకం అని టీడీపీ అభిమానులు విమర్శిస్తున్నారు. “అసలు మీరు మీ నాయన ఎక్కడ నుండి వచ్చారు? ఏ పార్టీని నమ్ముకుని రాజకీయం చేశారు? అసలు 2004 ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమాన్ని అధికారం కోసం తెరపైకి తెచ్చింది అప్పటి కాంగ్రెస్ నాయకుడైన మీ నాన్న కాదా? ఇంతకు కాంగ్రెస్ ఎప్పుడు మంచిది కాదు – నిన్ను సీఎంను చేయ్యనప్పటి నుండే కదా? ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ముస్లిం ఓట్లు పోకూడదు కాబట్టి చీకటి సంసారం చేస్తున్నావ్… అదే 2014లో కాంగ్రెస్ గెలిచి ఉంటే ఆ పార్టీ పంచన చేరేవాడివి కదా?,” అని ఘాటుగా విమర్శిస్తున్నారు.