పాదయాత్ర ద్వారా సిఎం సీటు కైవసం చేసుకోవాలని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఈ నెల 27న దానికి ముహూర్తం ఖరారు చేసుకోగా, అది కాస్త వెనక్కి వెళ్లిందని ఇటీవల మీడియా వర్గాలలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అసలు పాదయాత్ర రద్దుకు కూడా అవకాశం ఉందంటూ జరిగిన ప్రచారం ఎలా ఉన్నా, త్వరలో ‘పాదయాత్ర’ను ప్రారంభించడానికి జగన్ సిద్ధమవుతున్నారనేది లేటెస్ట్ న్యూస్. దీనికోసమే చినజీయర్ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందు తిరుమలకు కాలినడకన వెళ్లి స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలని జగన్ భావిస్తున్నారని, ఇదే విషయమై చినజీయర్ స్వామితో చెప్పినట్లుగా సమాచారం. అయితే జగన్ తిరుమలకు వెళ్ళడం కొత్తమీ కాదు, అది సంచలనమైన విషయం అంతకంటే కాదు. గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా జగన్ ఇలా తిరుమలకు వెళ్ళారు. అసలు ట్విస్ట్ ఏంటంటే… తిరుమల మాడవీధుల్లో పాదరక్షలతో తిరగకూడదనేది కేవలం నియమమే కాదు, భక్తులు ఎంతో నిష్టగా పాటించే అంశం.
అలాంటిది జగన్ ఏకంగా గుడిలోకి పాదరక్షలతో ప్రవేశించడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఆ ప్రభావమే జగన్ కు ముఖ్యమంత్రి సీటును దూరం చేసిందని శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల విశ్వాసం. అయితే ఈ సారి ఎలాగైనా సిఎం సీటు కొట్టాలని భావిస్తున్న జగన్, మరోసారి స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతో కీలకమైన పాదయాత్రకు ముందు స్వామి దర్శనం చేసుకుని, పాదయాత్ర ప్రారంభించాలని, తద్వారా అంతకుముందు దూరమైన హిందూ భక్త జనం కూడా దగ్గర అవుతారని… ఈ రకంగా అయితే ‘స్వామి కార్యం, సాకార్యం’ రెండూ అవుతాయని జగన్ స్కెచ్ వేసుకున్నట్లుగా పొలిటికల్ టాక్.