ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలతో పాటు ప్రజలలో కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదునుగా ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన నాయకులు అధికార పక్షాన్ని తూర్పార పడుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే వీటన్నిటికీ అడ్డుకట్ట వేసే ఓ సదవకాశం జగన్ కు వచ్చింది.
దీనిని జగన్ ఎలా సద్వినియోగం చేసుకుంటారో లేదో తెలియదు గానీ, నీతి అయోగ్ చేసిన ఓ కీలక వ్యాఖ్య ఏపీకి ఆయువుపట్టులా మారింది. “బీహార్ కు స్పెషల్ స్టేటస్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని” చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పటివరకు ఏపీకి స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అధ్యాయమని చెప్పిన బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే అవకాశాన్ని అధికార పక్షం వైసీపీ అందిపుచ్చుకుంది.
మరి కేంద్ర ప్రభుత్వంపై “స్పెషల్ స్టేటస్” అంశంలో జగన్ సర్కార్ దండయాత్ర చేస్తారో లేదో గానీ, బీహార్ పై చేసిన వ్యాఖ్యలు ఏపీకి కలిసి వచ్చే అంశం. ఒకవేళ ఏపీకి స్పెషల్ స్టేటస్ మంజూరు చేసినా, లేకున్నా పోరాడితే ప్రజల్లో మంచి గుర్తింపు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేగాక ప్రస్తుతం వెల్లువెత్తుతోన్న విమర్శలకు కూడా జగన్ అడ్డుకట్ట వేసినవారవుతారు.
ఇలాంటి అవకాశం చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఇసుమంత కూడా కేంద్రం కల్పించలేదు. ఎప్పటికప్పుడు స్పెషల్ స్టేటస్ ను దాటవేయడమే కాకుండా, దేశంలో ఇంకా స్పెషల్ స్టేటస్ ను ఏ రాష్ట్రానికి అమలు చేసే యోచన లేదని వివిధ సందర్భాలలో స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే అమలులో ఉన్న రాష్ట్రాలలో కూడా ‘స్పెషల్ స్టేటస్’ను తీసేసే ఆలోచనలు చేస్తున్నామని చెప్పి, నాడు ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ను ప్రకటించింది.
ప్యాకేజ్ కు ఒప్పుకున్నప్పటికీ, అది కూడా ఇవ్వకపోవడంతో మళ్ళీ ‘స్పెషల్ స్టేటస్’ అంశంతో నాడు చంద్రబాబు కేంద్రంతో పోరాడారు. మరి చంద్రబాబు సర్కార్ లో అన్ని మాటలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఉన్నట్లుండి మళ్ళీ ‘స్పెషల్ స్టేటస్’ అంశాన్ని తెరపైకి తీసుకురావడంలో ఉద్దేశం ఏమిటి? జగన్ సర్కార్ తమపై తిరుగుబాటు చేయదన్న విశ్వాసమా? లేక అసలు పోరాడే అవకాశం లేదని అర్ధమయ్యిందా? ఒకవేళ చంద్రబాబు సీఎంగా ఉంటే బీహార్ పైన అయినా ‘స్పెషల్ స్టేటస్’ ఇచ్చే సాహసం మోడీ సర్కార్ చేసేదా?
ఈ అనుమానాలన్నీ నివృత్తి కావాలంటే అందివచ్చిన ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రిగా జగన్ రెండు చేతులతో ఒడిసి పట్టుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సి ఉంటుంది. లేని పక్షంలో ‘కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వంతో జగన్ లాలూచీ పడ్డారంటూ’ ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చిన వారవుతారు. “పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు” తప్ప అన్న నినాదాన్ని ఓ ముఖ్యమంత్రిగా జగన్ అనుసరించాల్సిన తరుణం!