అధికారంలోకి రావడమే పరమావధిగా సాగుతున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 800 కిలోమీటర్ల మార్క్ దాటింది. అడిగిన వారికి అడగని వారికి లేదనకుండా వరాలు ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు ఆయన. పనిలో పనిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తనదైన శైలిలో విమర్శలు కురిపిస్తున్నారు.
ఒకానొక సందర్భంలో “చంద్రబాబు పెట్రోలు చార్జీలు విపరీతంగా పెంచారు. పక్కనే ఉన్న తమిళనాడులో పెట్రోలు మన కన్నా రూ. 7(ఒక్క లీటర్కు) తక్కువగా లభ్యమవుతోంది. కర్నాటకలో రూ.5 తక్కువకు దొరుకుతోంది. ఆఖరకు పెట్రోల్ను వదలకుండా బాబు దోపిడీకి పాల్పడుతున్నారు”, అని ఆయన అన్నారు.
పెట్రోలు రేట్ పెరిగితే అది రాష్ట్ర ఖజానాలో చేరుతుంది అది చంద్రబాబు దోపిడీ ఏంటో? ఆ విషయం పక్కన పెడితే వైఎస్సాఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండీ పెట్రోల్ పై మన రాష్ట్ర ప్రభుత్వం వేసినంత వ్యాట్ దేశంలో ఏ ప్రభుత్వం వెయ్యలేదు. అప్పుడు జగన్ తండ్రి చేసింది కూడా దోపిడీ అనే అనుకోవాలా? మరి నాలుకకు నరం లేకుండా విమర్శలు చేస్తే ఎలా?