yerra naveen pawan kalyanజనసేన పార్టీ 32 ఎమ్మెల్యే అభ్యర్థులను, నలుగురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేస్తూ తన మొదటి లిస్టును ప్రకటించింది. అయితే మొదటి లిస్టు తోనే పార్టీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జల్లా జనసేన కో-కన్వీనర్ యర్రా నవీన్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. తాడేపల్లి గూడెం స్థానం కోసం అర్జీ పెట్టుకున్న నవీన్ పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని, కానీ అలా జరగలేదని వాపోయారు. తనకు కనీసం చెప్పకుండా అభ్యర్థిని ఖరారు చేసారని వాపోయారు.

పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఇతర పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడిన వారికి టికెట్ ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ కనీసం జనసేన పార్టీ కార్యాలయంలో అప్లికేషన్ కూడా పెట్టలేదని వెల్లడించారు. దరఖాస్తులు చాలా వచ్చాయని చెప్పుకోవడం కాదు. అప్లికేషన్ పెట్టిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తనకు టిక్కెట్‌ ఇవ్వకపోయినా కష్టపడిన వారికి ఇచ్చి ఉంటే చాలా సంతోషించేవాడినని అన్నారు.

“పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చే పార్టలోకి వచ్చా. జనసేన పార్టీ అన్ని పార్టీల లాంటిది కాదని అనుకున్నా. కానీ ఇది కూడా స్వార్ధ రాజకీయ పార్టీనేనని తేలిపోయింది. నా రాజీనామాతో అయినా మళ్లీ ఇటువంటి పొరపాటు జరగకుండా చూస్తారనే రాజీనామా చేస్తున్నా. అభిమానుల అభిప్రాయంతో తదుపరి కార్యాచరణ రెండురోజుల్లో ప్రకటిస్తా” అని యర్రా నవీన్ తెలిపారు. జనసేన తాడేపల్లి గూడెం టిక్కెట్ తెచ్చుకున్న బొలిశెట్టి శ్రీనివాస్ రెండు రోజుల క్రితం వరకు టీడీపీ టిక్కెట్ ఆశించారు. పవన్ కళ్యాణ్ ను గట్టిగా విమర్శించే వారు కూడా. మొన్న చంద్రబాబు టిక్కెట్ ఈలి నానికి కంఫర్మ్ చెయ్యడంతో రాత్రికి రాత్రి జనసేన కండువా కప్పేసుకున్నారు.