MLA Vasantha Krishna Prasadనటసింహం నందమూరి బాలకృష్ణకి రాజకీయాలకి అతీతంగా అన్ని పార్టీలలో అభిమానులు ఉన్నారనేది ఎవరూ కాదనలేని సత్యం. కనుక వైసీపీలో కూడా ఉంటారు. అయితే టిడిపి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్యని బహిరంగంగా మెచ్చుకొనే పరిస్థితి వైసీపీలో లేదు కనుక పార్టీలో నేతలు, కార్యకర్తలు ఆయన సినిమాలు చూసి సంతోషిస్తుంటారు. అయితే వెలగలేరు గ్రామంలోని వైసీపీలోని బాలయ్య అభిమానులు వీరసింహారెడ్డి ఫ్లెక్సీ బ్యానర్‌ పెట్టి తన అభిమానం చాటుకొన్నారు. అది బాలయ్య అభిమానులు పెట్టిన్నట్లు కిందన పేర్కొన్నప్పటికీ ఆ ఫ్లెక్సీ బ్యానర్‌లో మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ఫోటో కూడా ముద్రించడమే చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఆయన గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటూ పార్టీ, ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

వచ్చే ఎన్నికలలో తనకి టికెట్‌ ఇస్తారో లేదో కూడా తెలీదని అటువంటప్పుడు గడప గడపకి తిరిజి‌ఐ ఆయాసపడటం ఎందుకన్నారు. టిడిపిలో తన స్నేహితుడు ఉయ్యూరు శ్రీనివాస్‌ ఇటీవల ఉయ్యూరులో సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తున్నప్పుడు తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించారు. పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేయగా వసంత కృష్ణ ప్రసాద్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాజకీయాలు చేయడమంటే పదిమండి గూండాలని వెంటవేసుకొని తిరుగుతూ సమాన్య ప్రజలని, ప్రతిపక్ష నేతలని, కార్యకర్తలని భయబ్రాంతులు చేస్తూ వేధించడమే అని, తాను ఆవిదంగా చేయలేకపోతున్నానని అందుకు పార్టీ అధిష్టానం తనపై ఆగ్రహంగా ఉందనే సంగతి కూడా తనకి తెలుసని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది సొంతపార్టీలో కొడాలి నాని వంటివారిని ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్యాలే అని గుసగుసలు వినిపించాయి.

ఈ నేపద్యంలో టిడిపికి చెందిన బాలయ్యతో వసంత కృష్ణ ప్రసాద్‌ ఫ్లెక్సీ బ్యానర్‌ ఊర్లో ప్రత్యక్షం అవడంతో వైసీపీలో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దానిని చూసిన వారందరూ వసంత కృష్ణ ప్రసాద్‌ టిడిపిలోకి వెళ్ళిపోయేందుకు సిద్దం అవుతున్నారా?అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.