మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్ మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమరావతిలోని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నాయకులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ… జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు.
పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ నేతలు దాదాపు పది కార్లతో రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారని టీడీపీ నాయకులు ఆ తరువాత పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు. దాడికి ముందే ప్రకటన చేసి మరీ వచ్చినా తగిన రీతిలో పోలీసు భద్రత లేదని టీడీపీ నాయకుల ఆరోపణ.
ఇది ఇలా ఉండగా.. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేస్తే అది ఏ రకంగానూ అధికార పార్టీకి మేలు చెయ్యదు. జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్… అధికార పార్టీ అధికార గర్వంగా ప్రజలలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. చంద్రబాబు ఎప్పుడో ఖాళీ చేసిన ఇంటి మీద దాడి చేస్తే ముఖ్యమంత్రి కోసం పని చేస్తున్నారని జోగి రమేష్ కు పేరు వస్తుందని ఆయన ఆశించవచ్చు.
అదే గనుక నిజమైతే పార్టీ శ్రేణులకు నాయకులకు జగన్ తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టే… పైగా ప్రజల దృష్టిలో పలచన అయ్యే అవకాశం కూడా ఉంది. రాజకీయాల కంటే తనకు సుస్థిర పాలన, లా అండ్ ఆర్డరే ముఖ్యమని జగన్ చెప్పదలిస్తే మాత్రం ఇందుకు కారణమైన వారిని గట్టిగా మందలించడమే కాకుండా పోలీసులను తమ పని తాము చెయ్యనివ్వాలి.
ఒకరకంగా ఈ సంఘటన జగన్ తన పాలనకు తాను ఇచ్చుకునే మార్కులు లాంటిది… మరి పాస్ అవుతారో లేదో చూడాలి.