రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతపు ఎంపీల వ్యవహారాన్ని చూసి ప్రజలు చీదరించుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానానికి తలొగ్గి, ఒక్కొక్కరు ఒక్కో విధంగా అమ్ముడుపోయారంటూ అప్పట్లో మీడియా వర్గాల నుండి సామాన్య ప్రజల వరకు అందరూ దుమ్మెత్తిపోసిన విషయాన్ని ఎవరూ మరిచిపోయి ఉండరు. నాటి కాంగ్రెస్ ఎంపీల ‘సినిమా’నే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా చూపిస్తున్నారని తాజాగా బట్టబయలయ్యింది.
శుక్రవారం నాడు కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై ఓటింగ్ జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే, ద్రవ్య బిల్లు అని చెప్తూ బిజెపి దీనిని పక్కదోవ పట్టించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఎలాంటిదో తేల్చాలని మళ్ళీ లోక్ సభకు పంపగా, ఈ బిల్లుపై ఓటింగ్ లేదంటూ స్పీకర్ చేసిన ప్రకటనకు గానూ బిజెపి వర్గీయుల నుండి ‘చేతిలో బల్లలు కొడుతూ…’ సభలో మంచి స్పందన వచ్చింది. అయితే మీడియా వర్గాల ద్వారా వెలుగు చూసిన విషయమేమిటంటే…
బిజెపి నేతలతో పాటు టిడిపి ఎంపీ సుజనా చౌదరి కూడా ‘బల్ల కొడుతూ’ హర్షం వ్యక్తం చేసారు. ‘ఎంత ప్రభుత్వంలో భాగస్వామి అయినా ఏపీకి నిధులు మంజూరు చేయలేమంటూ’ ముఖంపైనే చెప్పేసిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పరిజ్ఞానం కాస్త సుజనాకు వచ్చినట్లయితే, ఈ విధంగా బల్ల గుద్దుతూ హర్షం వ్యక్తం చేసేవారు కాదేమో అన్న భావన వీక్షకుల నుండి వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు సుజనా చౌదరి మీద అనేకానేక ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ వాటన్నింటిని పక్కన పెట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ సుజనాకే ఇటీవల రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయించారు.
బిజెపి పట్ల సుజనా చౌదరి కనపరుస్తున్న ప్రేమను చూస్తుంటే… తన బ్యాంకు రుణాల కోసం, తన వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాల కోసం ఏపీకి దక్కాల్సిన ‘స్పెషల్ స్టేటస్’ అంశాన్ని కేంద్ర సర్కార్ వద్ద తాకట్టు పెట్టేసారా? అన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. గతంలో సినీ నటుడు శివాజీ ఈ దిశగా సుజనాపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు పెద్దగా ప్రాధాన్యత సంతరించుకోని సదరు ఆరోపణలకు, ప్రస్తుతం తీవ్ర ప్రాధాన్యత దక్కుతోంది. సుజనా బల్ల కొట్టిన విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తప్పుపడుతూ కామెంట్ చేసారు. చూడబోతుంటే… ఏపీ పాలిట పెద్ద శాపంగా సుజనా రూపుదిద్దుకున్నారన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి.