y-s-jagan-in-self-defenceఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీలో రేగిన పెను కలకలానికి ముగింపు పలకాలని పార్టీ అధినేత జగన్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ సొంత జిల్లా కడప కంటే కూడా కర్నూలు జిల్లాలోనే ఆ పార్టీకి అత్యధిక సీట్లు దక్కాయి. జిల్లాలోని 14 ఎమ్మెల్యే సీట్లకు గాను 11 స్థానాలు, మొత్తం రెండు ఎంపీ సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుని సత్తా చాటింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన జిల్లా పర్యటన వైసీపీ వర్గాలకు షాకిచ్చింది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు 5 నుండి 7 వరకు అధికార పార్టీలోకి జంప్ చేయనున్నారని, ఏ క్షణమైనా వారు సైకిలెక్కేయడం ఖాయమని, దీనికి సంక్రాంతి పర్వదినాన్ని వేదికగా ఎంచుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై రాజకీయ వర్గాలతో పాటు, మీడియా వర్గాల్లోనూ ఈ కథనాలు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ నేపథ్యంలో స్వయంగా జగనే రంగంలోకి దిగినట్లుగా సమాచారం. ఈ ఒరవడిని ఆపకుంటే మున్ముందు మరింత మంది పార్టీని వీడడం ఖాయమని భావించిన జగన్, పూర్తి ఆత్మరక్షక ధోరణిలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. దీంతో అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్, పార్టీ మారే అవకాశముందని భావిస్తున్న ఎమ్మెల్యేలకు గురువారం సాయంత్రం నేరుగా తనే ఫోన్ చేశారట. గడచిన ఎన్నికల్లో పార్టీ వారికి ఇచ్చిన ప్రాధాన్యం, పార్టీ భవిష్యత్తును ప్రస్తావించిన జగన్, పార్టీ మారే యోచనను విరమించుకోవాలని సూటిగానే చెప్పినట్లు సమాచారం.

ఇక, తన నుంచి సహాయ సహకారాలు అందుకున్న ఎమ్మెల్యేలకు మాత్రం… ఓ విధమైన హెచ్చరికలు జారీ చేసినట్లుగా టాక్. గతంలో వ్యక్తిగతంగా తానూ చేసిన కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ… పార్టీ మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నేరుగా జగనే తమకు ఫోన్ చేయడంతో పార్టీ మారదామని భావించిన ఎమ్మెల్యేలు తమ వైఖరి మార్చుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కర్నూలు జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ వర్గాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.