‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవాలని జ్యోతి అనే ఓ యువతి బుధవారం రాత్రి పవన్ ఇంటి ముందు బైఠాయించింది. హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన జ్యోతి గత నాలుగు నెలలుగా పవన్ కళ్యాణ్ ను కలవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగా, పవన్ అందుబాటులో లేరని చెప్పి సెక్యూరిటీ తిప్పి పంపించేస్తున్నారు. అయితే బుధవారం నాడు ఎలాగైనా పవన్ ను కలవాలని నిర్ణయించుకున్న జ్యోతి, హైదరాబాద్, జుబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్ లోని పవన్ ఇంటి ముందు దాదాపు మూడు గంటల పాటు కూర్చుని నిరసన తెలిపింది.
‘తానూ పవన్ కళ్యాణ్ అభిమానిని, తన కష్టాలు పవన్ తో చెప్పుకుంటే పరిష్కారం అవుతుందని తెలిసి కలవాలని వచ్చానని, కానీ, ఆయన పిఏ పవన్ ను కలవకుండా చేస్తున్నారని’ మీడియా వర్గాలతో ఆవేదన వ్యక్తం చేస్తూ… అంతేకాదు ‘తానో పవన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు’ తెలపడంతో, ఆమె మానసిక పరిస్థితులపై అనుమానం వచ్చి, సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందివ్వడంతో, రంగప్రవేశం చేసిన పోలీసులకు ఆమె షాక్ ఇచ్చేలా ప్రవర్తించింది.
పవన్ కళ్యాణ్ ఇక్కడ లేరని చెప్పినా వెనక్కి తగ్గని జ్యోతి, తానూ ఎలాంటి న్యూసెన్స్ చేయకపోయినా, తనపై పోలీసులు దాడి చేసారని, అసభ్యకరంగా మాట్లాడారని, ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అంటూ పోలీస్ వారిపై కూడా మండిపడింది. అయితే కొంత సమయం తర్వాత జ్యోతికి నచ్చచెప్పి స్టేషన్ కు తరలించారు. దీంతో అర్ధరాత్రి పవన్ ఇంటి ముందు జరిగిన హైడ్రామా తెల్లారేపాటికి ప్రధాన వార్తగా మారిపోయింది.