మహిళలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం శబరిమల ఆలయం ఈరోజు తొలిసారిగా తెరుచుకోనుంది. అయితే సుప్రీం తీర్పును నిరసిస్తూ భారీ సంఖ్యలో ఆందోళనకారులు మహిళలను అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. శబరిమలకు వెళ్లే ప్రధాన మార్గం అయిన నీలక్కల్ వద్ద ఆందోళనకారులు ఆలయం వైపు వెళ్తున్న మహిళలను అడ్డుకున్నారు.
కేరళకు చెందిన ఒక మహిళ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక మహిళ శబరిమలకు వెళ్తున్న మహిళలలో ముందు ఉన్నారు. అయితే కేవలం 200 మీటర్లు నడవగానే వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దానితో వారు తిరిగి వెనక్కు వెళ్ళాక తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ మహిళ నలభై సంవత్సరాల మాధవిగా చెబుతున్నారు.
కేరళ యువతి ఒక క్రిస్టియన్ జర్నలిస్టు అని సమాచారం. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి తీరుతామని కేరళ సర్కారు స్పష్టం చేసింది. ఆలయానికి వెళ్ళే దారిలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పునకే తాము కట్టుబడి ఉన్నామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు.