దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ భంగపడింది. ఒక చిన్న రాష్ట్రం, ఒక కేంద్ర పాలిత ప్రాంతం తప్ప ఎక్కడా గెలవలేకపోయింది. పెద్ద రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో పరాజయం తప్పలేదు. ఈ రెండు రాష్ట్రాలలో ప్రశాంత్ కిషోర్ పని చేసిన పార్టీలే విజయం సాధించాయి.
మోడీ – అమిత్ షాలకు ధీటుగా నిలబడి ప్రశాంత్ కిషోర్ రెండు రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేక పార్టీలను గెలిపించారు. ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే తాను ఇక ముందు ఏ రాజకీయ పార్టీకీ పని చెయ్యబోనని, పొలిటికల్ స్ట్రాటజింగ్ నుండి తప్పుకుంటున్నా అని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఆ రకంగా తన కేరీర్ ను హై నోట్ లో ముగించారు.
దీనితో 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉండబోదు అనే అనుకోవాలి. 2019 ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు వైఎస్సార్ కాంగ్రెస్ కు గట్టిగా పని చేశాయి. అనేక రకాల వ్యూహాలతో టీడీపీని అనునిత్యం ఇబ్బంది పెట్టి… ఎన్నికల సమయానికి బలహీనపరిచాడు ప్రశాంత్ కిషోర్.
ఆయన రిటైర్మెంట్ తో వైఎస్సార్ కాంగ్రెస్ 2024 ఎన్నికలు సొంత బలం మీద పోరాడాల్సి రావొచ్చు. ఈ క్రమంలో 2024లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ వచ్చే అవకాశం ఉంది. ఒకరకంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి ఇది సానుకూల అంశమే.