జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో ఇంకో పక్క రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రేపు ఆయన అన్నీ పక్కన పెట్టి హస్తినకు వెళుతున్నారు. పవన్ కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రకటించిన రూ.కోటి చెక్కును ఈ సందర్భంగా సైనికాధికారులకు అందచేస్తారు.
ఇటీవల మిలిటరీ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ అమర సైనిక వీరుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం తరువాత విజ్ఞాన భవన్లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొంటారు. దేశానికి స్వచ్చమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తారు.
విద్యార్ధుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి రూపొందించిన షార్ట్ ఫిలింను ప్రదర్శించనున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాల అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన… బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నాటి నుండి ఈరోజు వరకు మోడీ గానీ అమిత్ షా గానీ పవన్ కళ్యాణ్ కు అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే ఇప్పటివరకు అప్పాయింట్మెంట్ కంఫర్మ్ కాకపోవడంతో పవన్ కళ్యాణ్ వారిని కలిసే అవకాశం ఉందని కూడా బయటకు చెప్పడం లేదు.