ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జగన్ బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటిషన్ మరోసారి సిబిఐ కోర్టు లో విచారణకు వచ్చింది. అయితే మరోసారి విచారణ వాయిదా పడింది. గత హియరింగ్ మాదిరిగానే ఈ సారి కూడా కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలంటూ జగన్, సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.
దీనిపై కోర్టు కొంత అసహనం వ్యక్టం చేసింది. ఇదే చివరి అవకాశం అంటూ తెల్చి చెప్పింది. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి కోర్టు చివరి అవకాశం ఇస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. తన భవిష్యత్తుని నిర్ణయించే బెయిల్ పిటిషన్ పై వీలైనంతగా ఆలస్యం చెయ్యాలని జగన్ భావించడం విచిత్రమేమీ కాదు.
అయితే ఈ కేసులో సిబిఐ కూడా అంతే తాత్సారం చెయ్యడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఒకరకంగా కౌంటర్ వెయ్యకుండా… సిబిఐ కూడా జగన్ కు సహకరిస్తుందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో పలువురు వెళ్ళబుచ్చుతున్నారు. ఇటీవలే ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు అన్యాపదేశంగా నీతి సూక్తులు చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ కి బాసటగా నిలిచారు జగన్.
అందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా అని అనుమానం. ఏది ఏమైనా 26న తన అఫిడవిట్ లో సిబిఐ తన ఉద్దేశం బయటపెట్టడం ఖాయం. బెయిల్ రద్దు చెయ్యాలనో చెయ్యకూడదనో చెప్పాల్సిందే. అప్పుడు ఈ విషయంగా పూర్తి క్లారిటీ వస్తుంది. దాని బట్టి ఆంధ్రప్రదేశ్ లో అనేక రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.