దివంగత హరికృష్ణ ఇటీవల వరకూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. అయినా పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనలేదు. ఆయన అకాల మరణంతో ఎన్టీఆర్ కుటుంబం నుండి మరొకరిని పొలిట్ బ్యూరో లోకి తీసుకోవాలని అంటున్నారు. హరికృష్ణ తనయులు ఇద్దరూ పిన్నవయస్కులు కావడంతో వారికి అవకాశం ఉండకపోవచ్చు.
అయితే చంద్రబాబు వారిని కలుపుకు పోవాలంటే మాత్రం వాళ్ళు సూచించిన మరొకరికి పదవి ఇవ్వొచ్చట. ఎన్టీఆర్ మరో తనయుడు బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అల్లుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేష్ అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రితోపాటు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
వీరికి మించి ఎన్టీఆర్ కుటుంబం నుండి రాజకీయాల్లో ఉన్న వారు లేరు. కాబట్టి కొత్తగా ఆ కుటుంబం నుండి ఎవరు వస్తారో చూడాలి. కొత్తగా వచ్చే వారికి అంత కీలకమైన పదవి ఇవ్వడం కూడా కష్టమే. మరోవైపు దివంగత నేతకు టీడీపీ సముచిత గౌరవం ఇచ్చిందనే చెప్పుకోవాలి. చంద్రబాబు ఆయన పార్థీవ దేహంపై పార్టీ జెండా కప్పారు, స్వయంగా ఆయన పాడే మోశారు. కార్యక్రమం పూర్తి అయ్యే వరకు అంతా తానై వ్యవహరించారు.