బల నిరూపణ కోసం కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుండటంతో ఆ రెండు పార్టీలు అప్రమత్తమయ్యాయి. బెంగళూరు నగర శివారులోని ఈగల్టన్ రిసార్టులో బస చేసిన జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పోలీసులు గురువారం ఆకస్మికంగా భద్రత ఉపసంహరించుకున్నారు.
తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునేందుకు భాజపా ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడకు పాల్పడిందని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపించాయి. అనంతరం రెండు పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముందుగా కేరళకు ప్రత్యేక విమానంలో తరలించాలని అనుకున్నాయి. అయితే పౌరవిమానయాన శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ప్లాన్ మార్చారు.
ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక బస్సుల్లో ఎక్కించి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య హైదరాబాద్ తరలించారు. కేరళకు తరలించడం కుదరదు అనుకున్నప్పుడు కాంగ్రెస్ పెద్దలకు ఇక్కడనుండి రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బరామిరెడ్డి ఫోన్ చేశారట. తనకు చెందిన పార్క్ హయత్ హోటల్ లో అన్ని ఏర్పాట్లు చేస్తా అని తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించమని చెప్పారట.
ముందుగా పార్క్ హయత్కు వెళ్లాలని భావించిన ఎమ్మెల్యేలు.. భద్రతా పరంగా అనుమానాలు వ్యక్తం కావడంలో ప్లాన్ మార్చుకున్నారు. దీంతో జేడీఎస్ ఎమ్మెల్యేలు నోవాటెల్ హోటల్కు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాజ్కృష్ణకు చేరుకున్నారు. వారు తిరిగి వెళ్లే వరకు మొత్తం ఖర్చు సుబ్బరామి రెడ్డినే పెట్టుకుంటారని సమాచారం.