పజిల్ : ఈ సెటిల్మెంట్ వైసీపీ ఎంపీ ఎవరో? ఏపీలోని అధికార పార్టీ నేతల తీరుతెన్నులు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆ కోవలోనే తాజాగా ఓ వైసీపీ ఎంపీ చేరారంటూ ప్రముఖ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓ సంచలన కధనం ప్రసారం చేసింది. సదరు ఎంపీ పేరు ఏమిటో బయటకు ప్రస్తావించకుండా సాగిన కధనంలో సారాంశం ఏమిటంటే…

నిత్యం వివాదాలతో మునిగిపోయే రాయలసీమ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎంపీ, ఓ దళిత మహిళతో సెటిల్మెంట్ వ్యవహారం నడిపారట! గతంలో పోలీస్ శాఖలో ఈ వైసీపీ ఎంపీ పనిచేసినట్లుగా, ఆ సమయంలో ఓ హత్యాచార కేసు నమోదు కాగా, సదరు కేసు కోర్టు పరిధిలో చేరింది.

తుది దశకు చేరుకున్న ఈ కేసు ఎంపీ గారి మెడకు చుట్టుకుంటుందేమో అన్న భయంతో, సదరు దళిత మహిళతో సెటిల్మెంట్ చేయాల్సిందిగా గతంలో తనతో పని చేసిన ఖాకీ మిత్రులను రంగంలోకి దించారట. విజయవాడ వేదికగా అక్టోబర్ మాసంలో ఈ సెటిల్మెంట్ వ్యవహారం జరిగినట్లుగా ఈ కధనంలో పేర్కొన్నారు.

విజయవాడకు చెందిన సిఐ, స్పెషల్ బ్రాంచ్ కు చెందిన మరో సిఐ, లా అండ్ ఆర్డర్ సిఐలు కలిసి విజయవాడలోని ఓ హోటల్ లోని రూమ్ నెంబర్ 205కు బాధిత కుటుంబాన్ని పిలిపించి, కొన్ని గంటల పాటు భయపెట్టి, ఫైనల్ గా 5 లక్షల రూపాయలకు సెటిల్ చేసినట్లుగా ఈ కధనంలో ప్రసారం చేసారు.

ఎంపీ గారి సమక్షంలో సెటిల్ అయిన మొత్తం 5 లక్షల డబ్బులు తన దగ్గర లేవని ఎంపీ చెప్పడంతో, చివరకు పోలీస్ అధికారులే ఆ 5 లక్షలను అప్పటికప్పుడు సర్దుబాటు చేసి బాధిత కుటుంబానికి ఇచ్చినట్లుగా ఈ కధనంలో పేర్కొన్నారు. ఇద్దరు పోలీస్ అధికారులు 2 లక్షల చొప్పున, ఓ పోలీస్ అధికారి ఒక లక్ష రూపాయలు, మొత్తంగా 5 లక్షలు ఇచ్చి ఈ కధకు శుభంకార్డు వేసినట్లుగా ప్రసారం చేసిన ఈ కధనం పొలిటికల్ అండ్ పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది.

ఈ కధనాన్ని టిడిపి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఎంపీ పేరు ఎవరో చెప్పాలంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోకు రిప్లైలు ఇచ్చే పనిలో ఉన్నారు నెటిజన్లు. ఇంతకీ ఆ అధికారిక వైసీపీ ఎంపీ ఎవరంటారు? మీకేమైనా తెలిస్తే మీరు కూడా తెలియజేయవచ్చు!