ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆస్తుల స్వాధీనానికి సిద్ధమైన ఈడీ… వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఏం చేయనుందనే ప్రశ్న ఆసక్తిని కలిగిస్తోంది. దీనిపై జగన్ శిబిరం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఆస్తులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈడీ రెండు విధానాలు అవలంబించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందులో మొదటిది ఆస్తులను పూర్తిగా తన అధీనంలోకి తీసుకోవడం. తద్వారా వాటిపై వచ్చే ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకోవడం.

ఇక రెండోది స్వాధీనం చేసుకున్న స్థిరాస్తులపై అద్దె వసూలు చేయడం. స్వాధీనం చేసుకున్న భవనాల్లో ఉన్న వారిని ఇబ్బంది పెట్టకుండా, వారిని కదల్చకుండా వారి నుంచి కొంత మొత్తాన్ని అద్దెగా వసూలు చేయడం. ఈడీ రెండో విధానానికే ఓటేస్తే, వైసీపీ అధినేతకు పెద్దగా సమస్య ఉండదని, మొదటి దాన్ని ఎంచుకుంటే చిక్కుల్లో పడక తప్పదని జగన్ శిబిరం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ఆస్తుల స్వాధీనంలో జగన్ ‘గుండె’గా భావించే ‘సాక్షి’ మీడియా కూడా ఉండడం మరింత ఆందోళనకు గురి చేసే అంశంగా మారింది.