ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని… సాక్షులను తన ప్రభుత్వానికి ఉన్న బలంతో ప్రలోభపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వేసిన పిటిషన్ మరోసారి హియరింగ్ కు వచ్చింది.
జగన్ ఇచ్చిన బెయిల్ కౌంటర్పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు న్యాయవాదులు రీజాయిండర్లు దాఖలు చేశారు. అయితే.. రఘురామ రీజాయిండర్లపై కౌంటర్ వేస్తామని జగన్ తరుపు న్యాయవాదులు చెప్పారు. కౌంటర్ వేయడానికి వీలు లేదని సీబీఐ కోర్టు నిరాకరించింది.
డైరెక్ట్గా రీజాయిండర్ల వాదనలు వినిపించాలని జగన్ న్యాయవాదులను సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ వేసే అధికారం ఎంపీకి లేదని, రాజకీయ దురుద్దేశంతోనే వేశారని జగన్ తరపు న్యాయవాది కోర్టులో వినిపించారు. జగన్, ఆర్ఆర్ఆర్ వాదనలపై తాము లిఖితపూర్వక వాదనలు కోర్టుకు సమర్పిస్తామని సిబిఐ తరపున న్యాయవాది కోర్టుని కోరారు.
గతంలో ఈ పిటిషన్ పై తన అభిప్రాయాన్ని తెలపమన్నపుడు తాము కోర్టు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సిబిఐ ఏకవాక్య కౌంటర్ దాఖలు చేసింది. తద్వారా మోడీ ప్రభుత్వం జగన్ కు అనుకూలంగా పని చేసిందని విమర్శలు వచ్చాయి. అయితే ఈ కీలక తరుణంలో ఈ ఇష్యూ పై సిబిఐ తన అభిప్రాయాన్ని చెప్పకకుదరదని న్యాయనిపుణులు అంటున్నారు.
సహజంగా సిబిఐ కేంద్రంలో అధికారంలో ఉన్న వారి కనుసన్నలలో పని చేస్తుందనే అపవాదు జనప్రాబల్యంలో ఉంది. దానితో ఇక మోడీ అమిత్ షాల మనసులో అసలు జగన్ విషయంలో ఏముందో తేలిపోయే సమయం ఆసన్నమైందని అంటున్నారు.