చివరి రోజు వరుణుడు కరుణిస్తే విజయం తధ్యం అనుకున్న టీమిండియాకు కోలుకొని షాక్ ఇచ్చారు విండీస్ బ్యాట్స్ మెన్లు. చివరి రోజు ఆట పూర్తిగా జరగగా, కేవలం రెండు వికెట్లను మాత్రం భారత బౌలర్లు సాధించగలిగారు. అయిదవ రోజు ఆటలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన విండీస్ మ్యాచ్ ను ‘డ్రా’ చేసుకోవడంలో విజయం సాధించింది.
48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఇన్నింగ్స్ ని ఆరంభించిన విండీస్ బ్యాట్స్ మెన్లు దూకుడైన ఆటతీరుతో టీమిండియా బౌలర్లపై ఎదురుదాడి చేసారు. దీంతో స్కోర్ బోర్డు వేగంగా పరుగులు పెట్టడంతో విండీస్ బ్యాట్స్ మెన్లపై ఉన్న ఒత్తిడి తగ్గడం ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ఇన్నింగ్స్ కు వెన్నుమూకగా నిలిచిన బ్లాక్ వుడ్ ఈ ఇన్నింగ్స్ లోనూ రాణించి 63 పరుగులు చేయగా, మరో ఎండ్ లో చేజ్ వీరవిహారం చేసాడు.
అయితే వీరిద్దరి జోడికి 141 పరుగుల వద్ద అశ్విన్ బ్రేక్ వేయగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డోరిచ్ కూడా ఎదురుదాడి చేస్తూ విండీస్ ఇన్నింగ్స్ ని పరుగులు పెట్టించాడు. చేజ్ – డోరిచ్ ల జోడి ఆరో వికెట్ కు 144 పరుగులు జోడించడంతో విండీస్ ఓటమి నుండి తప్పించుకున్నట్లయ్యింది. ఈ తరుణంలో చేజ్ సెంచరీ పూర్తి చేయగా, డోరిచ్ 74 పరుగుల వద్ద మిశ్రా బౌలింగ్ లో ఎల్ బిడబ్ల్యు రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన హోల్డర్ (64 నాటౌట్) కూడా రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
చివరి రోజు విండీస్ బ్యాట్స్ మెన్లలో బ్లాకు వుడ్ 63, డోరిచ్ 74, హోల్డర్ 64 నాటౌట్, చేజ్ 137 నాటౌట్ రాణించారు. బౌలింగ్ లో 5 వికెట్లు తీయడంతో కీలకమైన తరుణంలో సెంచరీ చేసి జట్టుకు అండగా నిలిచిన చేజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో రెండు టెస్టులు ముగిసే సమయానికి టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది.