అధికార గణం మొత్తం అండగా ఉన్నా ఎందుకనో జగన్ ప్రభుత్వం నీటి నిర్వహణలో విఫలం అవుతూనే ఉంది. మొన్న వచ్చిన వరదలప్పుడు కేవలం సరైన ప్లానింగ్ లేక ముంపు ఎక్కువయ్యిందని, వరద వచ్చిన కాల్వలు నింపలేకపోయారని ప్రభుత్వం విమర్శల పాలయ్యింది. ఇప్పుడు మరోసారి ఎగువ రాష్ట్రాలలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ఏపీ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి దిగువకు వదలడంలోఅధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు.
డ్యామ్ భద్రతను గాలికి వదిలేసిపట్టించుకోకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున.. డ్యామ్ మొత్తం నిండిపోయి.. ఎగువ నుంచి నీరు కిందకు పొంగిపోయింది. నాలుగు గేట్లు.. చాలా స్వల్పంగా ఎత్తినా పై నుండి వస్తున్న వరద నీరు ఎక్కువగా ఉండడంతో అది ఏ మాత్రం సరిపోలేదు. ఈరోజు విషయం మీడియాలో రావడంతో.. ఉన్నతాధికారులు హుటాహుటిన డ్యామ్ వద్దకు వచ్చి పది గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. దీనితో పెద్ద ప్రమాదం తప్పింది. వరద ఉధృతికి డాం గేట్లు గనుక బద్దలై ఉంటే కొన్ని గ్రామాలు సమూలంగా తుడిచిపెట్టుకుపోయేవి.
అయితే అధికారులు మాత్రం తమకు పై నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే.. తాము నీటి విడుదలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము కానీ సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదంటున్నారు. ఒకవేళ అనుకోనిది ఏమైనా జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహించేవారు? ఒకే విషయంలో పదే పదే విఫలం అవుతున్న పాఠాలు నేర్వకపోతే అది ఎవరి తప్పు? ప్రభుత్వాధినేతలు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం చేసి జరగరానిది జరిగితే అది రాజకీయంగా కూడా కోలుకోలేని దెబ్బ తీస్తుంది.