2019 ఎన్నికల తరువాత ఇద్దరు నాయకుల రాజకీయ భవిష్యత్తు మీద తరచు చర్చ జరుగుతుంది. అందులో పార్టీ ఓడిపోయినపుడల్లా పార్టీ మారే గంటా శ్రీనివాసరావు అలాగే జనసేన నుండి బయటకు వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ. వీరిద్దరూ బీజేపీ లో చేరే అవకాశం ఉందని అప్పట్లో గట్టిగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఇద్దరూ బీజేపీ ఆప్షన్ ని పక్కన పెట్టేసినట్టుగా కనిపిస్తుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కారణంగానే ఇద్దరు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది. గంటా ఇప్పటికే కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దానిని ఆమోదించుకుని స్టీల్ ప్లాంట్ అంశాన్ని పెద్దది చెయ్యాలనే ప్రయత్నంలో ఉన్నారు ఆయన. మరోవైపు… జేడీ లక్ష్మీనారాయణ కూడా బీజేపీని ఇబ్బంది పెట్టే ఈ అంశం మీదే పని చేస్తున్నారు.
ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. కార్మికుల ఉద్యమానికి లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు. అంతేగాక స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడవడానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా తెలియజేస్తూ కేంద్రానికి లేఖ పంపారు.
ఇదే సమయంలో వివిధ పార్టీల నేతలతో చర్చలు జరుపుతూ… కార్మికుల ఉద్యమానికి మద్దతు కూడగడుతున్నారు. ఇది రాజకీయంగా బీజేపీని ఇబ్బంది పెట్టడం ఖాయం. ఒకప్పుడు తమ పార్టీలో చేరి తమకు బలం అవుతారు అనుకున్న నేతలు ఇప్పుడు తమకు వ్యతిరేకంగా పనిచెయ్యడం జీర్ణించుకోలేకపోతున్నారు కమలనాథులు