మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పక్షం రోజులకు ఓసారి మీడియా ముందుకు వచ్చి తాజా రాజకీయ పరిస్థితుల పై పిచ్చాపాటి మాట్లాడటం మాములే. తాజాగా ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర పరిస్థితి భయంకరంగా ఉందన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టాక మరింత స్పష్టత వస్తుందన్నారు. దేవుడు ఉన్నాడని తరుచూ సీఎం జగన్ అంటుంటారని.. ఇప్పుడు ఆ దేవుడే ఆయన్ను ఆశీర్వదించాలని ఉండవల్లి అన్నారు. ఈ క్రమంలో ఆయన మోడీతో ఎలా పని చెయ్యాలి అనేదాని పై ఉండవల్లి ముఖ్యమంత్రి జగన్ కు ఒక సలహా ఇచ్చారు.
“నాకు ప్రత్యేక హోదా, పోలవరం సంగతి తేల్చండి. లేదంటారా ఆ బెయిలు ఏదో రద్దు చేసెయ్యండి మీరు ప్రధానిగా ఉన్నంతవరకూ వెళ్లి జైలులో కూర్చుంటా అని చెప్పాలి. అత్యంత ప్రజాధారణ కలిగిన జగన్ ను జైలుకు పంపే సాహసం వాళ్ళు ఖచ్చితంగా చెయ్యలేరు,” అని ఉండవల్లి జగన్ కు సలహా ఇచ్చారు.
శశికళను జైలులో పెట్టినట్టు పెట్టేస్తే పరిస్థితి ఏంటి అని మీడియా అడగగా… “శశికళకు జగన్ కు అసలు పొంతన లేదు. శశికళ మీద ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆమె జయలలితని చంపేసింది అని అందరినీ నమ్మించి ఆమెను జైలులో పెట్టారు. జగన్ సంగతి అలా కాదు. దేశంలో ఎక్కడ లేనట్టుగా 50 శాతం పైగా ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చాడు,” అని చెప్పుకొచ్చారు.