vizag-cyclone-kyant-match-cancelతెలుగు గడ్డపై చాలా అరుదుగా జరిగే క్రికెట్ మ్యాచ్ లకు ఈ నెల 29వ తేదీన విశాఖ వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు లేదంటూ ‘కయాంట్’ తుఫాన్ హెచ్చరికలు జారీ చేస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారడంతో, విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

విశాఖకు ఆగ్నేయంగా 685 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ‘కయాంట్’ వేగంగా తీరం వైపు దూసుకొస్తుండడంతో విశాఖ వాసులు భయంతో వణికిపోతున్నారు. రెండేళ్ల క్రితం సంభవించిన ‘హుద్‌హుద్’ను జ్ఞాపకాలు ఇంకా వెన్నాడుతుండడంతో, విశాఖ వాసుల్లో వణుకు మొదలైంది. రెండేళ్ల క్రితం హుద్‌హుద్ తుఫాను చేసిన గాయం ఇంకా మానక ముందే మరోమారు ‘కయాంట్’ రూపంలో మరో తుపాను దూసుకు వస్తోంది.

హుద్‌హుద్ సమయంలో ప్రచండ వేగంతో వీచిన గాలులకు విశాఖ నగరం చిగురుటాకులా వణికిపోయింది. పెద్ద పెద్ద వృక్షాలు నేలమట్టమయ్యాయి. ఆనాటి గాయం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న విశాఖ వాసులకు కయాంట్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తుపాను ప్రభావంతో గురువారం నాటి నుంచి ఏపీలో, శుక్రవారం నుండి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ నెల 29న ప్రకాశం జిల్లాలో ‘కయాంట్’ తీరం దాటే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొనడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ తుఫానుపై మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్టణంలో కలెక్టర్లతో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మరో వైపు ఈనెల 29న విశాఖలో జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌ను రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే తెలుగు ప్రేక్షకులు నిరుత్సాహపడడం ఖాయం.