Vishnu-Manchu-Meets-YS-Jaganమంచు కుటుంబం క్రమంగా రాజకీయ రంగం వైపు అడుగులు వేస్తుందా అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. కారణం భార్య విరోనికాతో కలిసి లోటస్ పాండ్ వెళ్లి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశాడు మంచు విష్ణు. ఆయనతో ఇద్దరూ కాసేపు ముచ్చటించారు. విష్ణు భార్య వెరోనికా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడి కూతురు. ఈ లెక్కన జగన్ కి ఆమె కజిన్ సిస్టర్. దీనితో ఇది క్యాజువల్ విజిట్ మాత్రమేనని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మరో వర్గం వాదన వేరేగా ఉంది.

చిత్తూరు జిల్లాతో ఎప్పటినుంచో అనుబంధం కలిగివున్న మోహన్ బాబు.. విద్యానికేతన్ పేరుతో అక్కడ ఎడ్యుకేషన్ సర్వీస్ కూడా చేస్తున్నారు. మోహన్ బాబును జిల్లా నుండి పోటీ చేయబోతున్నారని వార్తలు వ్యాపిస్తున్నాయి. దీనికి విష్ణు జగన్ తో మంతనాలు జరుపుతున్నారని సమాచారం. గతంలోనే తెలుగుదేశం పార్టీతో ఉంటూ రాజ్యసభ సభ్యుడిగా చేసిన మోహన్ బాబు.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో వచ్చిన మనస్పర్ధలతో లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు సినిమాలు కూడా పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో మళ్ళీ రాజకీయాల మీద దృష్టి పెట్టారు మోహన్ బాబు.

మంచు మనోజ్ అడపాదడపా సోషల్ ఇష్యూస్ తో కూడిన ట్వీట్స్ చేస్తూ పొలిటికల్ టచ్ ఇస్తున్నాడు. ఆ మధ్య మోదీని టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టిన మనోజ్.. ఇటీవలే పవన్ కళ్యాణ్‌కి కాంప్లిమెంట్ ఇస్తూ జనసేనను పొగిడేశాడు. మంచు కుటుంబానికి వేరోనికా కారణంగా జగన్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో ఆమె కవలలకు జన్మనిచ్చినప్పుడు ఇంటికెళ్లిమరీ పలకరించి వచ్చారు జగన్. ఆయన చంచల్ గూడ జైల్లో ఉండగా కొడుకు విష్ణుతో కలిసి మోహన్ బాబు పరామర్శించి వచ్చారు కూడా. ఈ క్రమంలో ఈ భేటీ గురించి అటు టాలీవుడ్, ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతుంది.