vishal-varalaxmi-sarathkumarప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె, ప్రస్తుత హీరోయిన్ వరలక్ష్మి మరియు హీరో విశాల్ ల ఏడేళ్ల ప్రేమ బ్రేకప్ అయ్యిందా? ప్రస్తుతం కోలీవుడ్‌ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా తానేంటో నిరూపించుకున్న విశాల్, ప్రముఖ నటుడి కుమార్తెగానే కాక హీరోయిన్‌గా తనకంటూ పేరు సంపాదించుకున్న వరలక్ష్మి ఏడేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు.

త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కుతున్నట్టు వార్తలు కూడా వినిపించాయి. తమిళ నడిగర్ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కల్యాణ మండపంలో జరిగే తొలి పెళ్లి తనదేనని విశాల్ ఇదివరకే ప్రకటించాడు కూడా! ఈ క్రమంలో తాజాగా వరలక్ష్మి ట్విట్టర్‌ లో చేసిన వ్యాఖ్యలు వీరి బంధంపై ప్రశ్నలు రేకెత్తేలా చేశాయి, అలాగే కోలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల కాలంలో ప్రేమ పరిహాసంగా మారుతోందంటూ ట్విట్టర్‌ లో ఆవేదన వ్యక్తం చేసిన వరలక్ష్మి ఏడేళ్ల బంధాన్ని ఓ వ్యక్తి తేలిగ్గా తుంచేయాలనుకుంటున్నాడు అని పేర్కొంది.

ఈ విషయాన్ని నేరుగా ఆ అమ్మాయికే చెప్పేసాడని పేర్కొంది. “ప్రేమంటే ఇంతేనా? ప్రపంచంలో ప్రేమ ఏమైపోతుందో? ఎక్కడుందో?” అంటూ ఆవేదనగా ప్రశ్నించింది. ఆమె ట్వీట్ విశాల్‌ ను ఉద్దేశించి చేసినదేనని కోలీవుడ్ ఇప్పుడు కోడై కూస్తోంది. ఇటీవల జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ – శరత్‌ కుమార్ ల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విశాల్ తన ప్రేమకు బ్రేకప్ చెప్పి ఉంటాడని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.