Vishal orders not to give trailers to TV channels for freeతమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన తెలుగు కం తమిళ హీరో విశాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సినిమా టికెట్ లో ఒక రూపాయి రైతులకు కేటాయించాలంటూ విశాల్ తీసుకున్న నిర్ణయంపై పలువురు నిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న తాము అందులో రూపాయి వదులుకోవడమా? అంటూ నిట్టూర్పును ప్రదర్శించగా, దీనికి పరిష్కారం చూపిస్తామన్న విశాల్… వారికి సరికొత్త ఆదాయ మార్గం చూపించాడు.

తమిళనాడులో ఉన్న న్యూస్ ఛానెళ్లకు ట్రైలర్లు, క్లిప్పింగులు, పాటలు ఉచితంగా వేసుకునేందుకు అంగీకరించవద్దని నిర్మాతలకు సూచించాడు. టీవీ చానెళ్లు తమ సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు, హాస్య సన్నివేశాల క్లిప్పింగులు, పాటలు వేయడం ద్వారా టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటున్నాయని, ఒక రకంగా తమ సినిమాలకు సంబంధించిన వాటి వల్లే వారికి ఆదాయం చేకూరుతుందని, అందులో వాటా ఇవ్వడంలో తప్పులేదని పేర్కొన్నాడు. అందుకే ఇకపై ఉచితంగా వాటిని వాడుకునే అవకాశం ఇవ్వవద్దని, వేస్తే డబ్బులు డిమాండ్ చేయాలని నిర్ణయించారు.

టీవీ చానెళ్లకు టీఆర్‌పీ రేటింగ్స్‌ ఆధారంగా ధరలు నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్‌ రైట్స్‌ తీసుకునేందుకు విముఖత చూపుతున్న టీవీ చానెళ్లు అవే సినిమాల పాటలు, ట్రైలర్లు, కామెడీ క్లిప్పింగ్‌లను మాత్రం ఉపయోగించుకుంటూ క్యాష్‌ చేసుకుంటాయన్నాయని నిర్మాతలు పేర్కొంటున్నారు. అయితే సినిమాలకు పబ్లిసిటీ ఇస్తూ, సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించే టీవీ ఛానెళ్లు దీనిని అంగీకరిస్తాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.