తన పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు వైద్య పరీక్షలు చేయిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్న సమయంలో దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న హీరో విశాల్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. చెన్నైలోని ట్రిపుల్ కేన్ లోని అరిమా సంఘం, ఎంపీఎస్ పాలీ క్లినిక్ నిర్వాహకులతో కలిసి చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా.., ఈ నేపధ్యంలో నడిగర్ సంఘంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ సంఘ సభ్యులు కొందరు టీ.నగర్, అబిబుల్లా రోడ్డులోని సంఘ ఆవరణలో ఆందోళనకు దిగారు.
సంఘ భవన నిర్మాణం కోసం నిధిని సమకూర్చేందుకు నిర్వహించిన స్టార్స్ క్రికెట్ కు సంబంధించి కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటూ వారాహి అనే సంఘ సభ్యుడు ఆరోపణలు గుప్పించారు. దీనిపై విశాల్ స్పందిస్తూ.., ఆరోపణలు చేసేవారు ఆధారాలను చూపాలని సవాల్ చేసారు. గతంలో నడిగర్ సంఘంలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించిన అన్ని వివరాలను మరో 10 రోజులలో వెల్లడించనున్నామన్నారు. అలాగే తమిళ నిర్మాతల మండలిపై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఎలాంటి లేఖ రాలేదని, దీనిపై క్షమాపణలు చెప్పే అవకాశం లేదని విశాల్ స్పష్టం చేశారు.