ఇంగ్లాండ్ తో జరుగుతోన్న మొదటి టెస్ట్ మ్యాచ్ చివరి దశకు చేరుకుంది. బౌలర్స్ కు అనుకూలిస్తున్న పిచ్ పైన విజయానికి 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి, విజయానికి మరో 84 పరుగుల దూరంలో నిలిచింది. ఉంటానికి 5 వికెట్లు ఉన్నా, క్రీజులో ఉన్న విరాట్ కోహ్లి ఒక్క వికెట్ మాత్రమే టీమిండియా, ఇంగ్లాండ్ విజయాలను డిసైడ్ చేయనుంది.
ఈ పరుగులు టీమిండియా చేధిస్తుందన్న నమ్మకం ఉందంటే అది ఒక్క విరాట్ కోహ్లి పైనే! తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కు కొరకరాని కొయ్యగా మారి 149 పరుగులు చేసిన కోహ్లి, లక్ష్య చేధనలోనూ అదే రీతిలో 43 పరుగులతో క్రీజులో నిలిచాడు. ఓ పక్కన వచ్చిన బ్యాట్స్ మెన్లు వచ్చినట్లు పెవిలియన్ చేరుతున్నా, మొక్కవోని దీక్షతో విరాట్ తన లక్ష్యానికి గురిపెట్టాడు. విరాట్ తో పాటు కీపర్ దినేష్ కార్తీక్ 18 పరుగులతో చక్కని సహకారం అందించే ప్రయత్నం చేస్తున్నాడు.
అంతకుముందు రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కేవలం 180 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్పిన్నర్ అశ్విన్ 4, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ 5 వికెట్లతో సత్తా చాటగా, చివరి వరుస ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ కరణ్ 63 పరుగులు చేయడంతో, కనీసం ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. అయితే ఈ పిచ్ పైన 194 పరుగులు సాధించడం కూడా గొప్ప విషయమే. టీమిండియా విజయానికి, ఇంగ్లాండ్ విజయానికి వారధిలా విరాట్ కోహ్లి క్రీజులో నిలిచాడు.