Vijaysai Reddy sat on Rajya Sabha Chairman's seatఅవును రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభ ఛైర్మన్‌ సీటులో కూర్చోన్నారు. కూర్చోవడమే కాదు ఈరోజు సభను నడిపించారు కూడా. ఎలా సాధ్యం అంటే గత నెలలో రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానల్‌ను రాజ్య సభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు పునర్వ్యవస్థీకరించారు. అప్పుడు దానిలో విజయసాయి రెడ్డికి రాజ్యసభ వైస్ ఛైర్మన్‌గా అవకాశం లభించింది.

ఎప్పుడైనా రాజ్యసభ ఛైర్మన్‌, డెప్యూటీ ఛైర్మన్‌ ఇద్దరూ రానప్పుడు వైస్ ఛైర్మన్‌గా ఎంపికైన ఎంపీ రాజ్యసభను నడిపించడం ఆనవాయితీ. ఈరోజు ఛైర్మన్‌, డెప్యూటీ ఛైర్మన్‌ ఇద్దరూ రాకపోవడంతో విజయసాయి రెడ్డి రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్ హోదాలో సభాధ్యక్షస్థానంలో కూర్చొని సభను నడిపించారు.

వెంకయ్య నాయుడు తరువాత మరో తెలుగు వ్యక్తి ఆ సర్వోన్నతమైన స్థానంలో కూర్చొని సభను నడిపించడం చాలా గొప్ప విషయమే కానీ అక్రమాస్తుల కేసులలో ఏ-2గా ఉండి 16 నెలలు జైలులో గడిపివచ్చిన విజయసాయి రెడ్డి ఆ సర్వోన్నతమైన స్థానంలో కూర్చొని చట్టసభను నడిపించడం దౌర్భాగ్యం అనుకోవాలేమో? అని టిడిపి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.