విజయవాడ అంటే… సినిమాలు, రాజకీయాలు తప్ప ఇతర సంగతులు గుర్తుకు రావడం బహు అరుదుగా జరిగే విషయం. అలాంటి విజయవాడ నగరం ప్రజలకు సరికొత్త అనుభూతులను పంచుతోంది. మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న పుష్కరాల ప్రభావం విజయవాడ నగరంపై ఎంత బాగా పడిందంటే… సాయంత్ర వేళ అయ్యిందంటే నగరం మొత్తం విద్యుత్ వెలుగుల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణా పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కనకదుర్గమ్మ కొలువై ఉన్న, నగరం అంతా పండగ శోభ సంతరించుకుంది. నగరంలోని అన్ని వీధులు, ప్రముఖ కట్టడాలు, రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లు తదితరాలన్నింటినీ విద్యుద్దీప కాంతులతో అలంకరించడంతో, రాత్రి పూట చూస్తున్న వారు అద్భుతమని కితాబిస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ పిల్లర్లపై ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల విద్యుత్ దీపాలు సరికొత్త అనుభూతులను పంచుతోంది.
గుంటూరు జిల్లా అయిన బ్యారేజ్ కు మరో వైపు సీతానగరం నుంచి చూసేవారికి బ్యారేజ్, ఆపైన వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా దర్శనమిస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. వీటికి తోడు స్వరాజ్య మైదానంలో ఏర్పాటైన తితిదే నమూనా ఆలయాన్ని గురించి వర్ణించేందుకు ఎన్ని మాటలైనా చాలవంటున్నారు స్థానిక వాసులు. కళ్లు మిరుమిట్లు గొలిపే రంగు రంగుల విద్యుద్దీప కాంతులతో, నిజంగానే తిరుమలలో సంచరిస్తున్నామా? అన్న రీతిలో ఉందని మీడియా వేదికలుగా పంచుకుంటున్న ఆనందాల వెల్లువ ఎన్నో ఎన్నెన్నో.