పవిత్ర కృష్ణా పుష్కరాల దృష్ట్యా ఈ నెల 9 నుంచి 25వ తేదీ వరకూ విజయవాడ పరిసర ప్రాంతాల్లో మాంసం, చేపలు తదితరాల వంటి మాంసాహార విక్రయాలను నిషేధిస్తున్నట్టు నగర కమిషనర్ జీ వీరపాండియన్ తెలిపారు. ఈ మేరకు అన్ని కబేళాలనూ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన కమీషనర్, హోటళ్లలో సైతం మాంసాహారాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.
నగరానికి వచ్చే భక్తులు, యాత్రికుల మనోభావాలను వ్యాపారులు అర్థం చేసుకుని సహకరించాలని కోరిన ఆయన, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. దీంతో ఏకంగా 16 రోజుల పాటు విజయవాడ పరిసర ప్రాంత వాసులకు శాఖాహార భోజనమే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ 16 రోజుల పాటు నగరంలోకి ఎటువంటి వాహనాలు రాకుండా కూడా కమీషనర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.