ప్రముఖ తమిళ హీరో, డీఎండీకే చీఫ్ విజయకాంత్ కు సోమవారం నాడు చెన్నైలోని ఈ-రోడ్లో విచిత్ర అనుభవం ఎదురైంది. సతీమణి ప్రేమలతతో కలిసి ఈ-రోడ్ జిల్లాలోని సెన్నిమలై మీదుగా ఓ ఆలయానికి వెళ్లారు. అయితే మధ్యాహ్య భోజన సమయం కావడంతో మార్గమధ్యంలో కారును ఓ పెంకుటిల్లు వద్ద ఆపి అక్కడ ఉన్న ఖాళీ ప్రదేశంలో అరిటాకులు పరుచుకుని ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని వడ్డించుకున్నారు.
ఎండ దంచేస్తుండడంతో విజయకాంత్ తన తలపై ఎర్రని తువ్వాలను తలపాగాలా చుట్టుకున్నారు. అదే సమయంలో పొలం నుంచి వచ్చిన ఇంటి యజమాని వారిని చూసి అదిలించాడు. ఎవరు మీరు? ఇక్కడ భోజనం ఎందుకు చేస్తున్నారంటూ కసురుకున్నాడు. అయితే దగ్గరికొచ్చి చూసిన రైతు ఆశ్చర్యపోయాడు. వారు సాక్షాత్తు డీఎండీకే చీఫ్, నటుడు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత కావడంతో నోట మాట రాలేదు.
ఆ తర్వాత తేరుకుని ఇంట్లో నుంచి మరిన్ని వంటకాలు తెచ్చి వారికి వడ్డించాడు. రైతు అభిమానానికి ముగ్ధులైన వారు వాటిని కూడా ఆరగించారు. విషయం తెలిసిన స్థానికులు వారిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో ఇంటి యజమానికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు.