Vijaya Sai Reddyసరిగ్గా వారం రోజుల క్రితమే విజయసాయి రెడ్డి చేతిలో నుంచి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల సమన్వయ బాధ్యతలను తీసుకొని సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించి, విజయసాయి రెడ్డికి పార్టీ అనుబంద విభాగాల బాధ్యతలతో సరిపెట్టారు. దీంతో ఆయనకు సిఎం జగన్మోహన్ రెడ్డికి మద్య దూరం పెరిగిందని, అందుకే పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గించారని ఊహాగానాలు వినిపించాయి.

మరి వాటితో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళితే రాజకీయంగా వైసీపీ నష్టపోతుందని భావించారో లేక విజయసాయి రెడ్డి తెర వెనుక చక్రం తిప్పారో గానీ మళ్ళీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించి సజ్జల స్థాయిని తగ్గించారు.

మళ్ళీ ఆయనకు పాత బాధ్యతలన్నీ అప్పగించి సజ్జలకి కత్తెర వేసి ఎమ్మెల్యేలు, మీడియా సమన్వయ బాధ్యతలకు పరిమితం చేశారు. సిఎం జగన్మోహన్ రెడ్డి పేరున వెలువడిన ఓ ప్రకటనను విజయసాయి రెడ్డి స్వయంగా నిన్న ట్వీట్ ద్వారా పార్టీ శ్రేణులకు తెలియజేయడం విశేషం. దానినే మళ్ళీ వైసీపీ విడుదల చేసింది.