వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డికి అనూహ్యంగా కేంద్రంలో కీలక పదవి లభించింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ నేత డాక్టర్ సుధాంశు త్రివేది ఇంకో సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే కేంద్రమంత్రివర్గం ప్రక్షాళన గావించినప్పుడు పీఏసీ సభ్యులుగా వ్యవహరించిన భూపేశ్ యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్లకు క్యాబినెట్లో చోటు లభించింది. తత్ఫలితంగా పీఏసీలో వీరిరువురి స్థానాలు ఖాళీ అయ్యాయి.
ఈ రెండు స్థానాలను భర్తీ చేయడానికి నామినేషన్లు ఆహ్వానించగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, బీజేపీ నేత డాక్టర్ సుధాంశు త్రివేదిలు నామినేషన్లు వేశారు. ఇతరులెవరూ నామినేషన్ వేయలేదు.
పోటీలో ఎవరూ లేకపోవడంతో వీరిద్దరు పీఏసీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజా పద్దుల కమిటీ అనేది కేంద్రంలో చాలా కీలక కమిటీ కేంద్ర ప్రభుత్వం చేసే ఖాతాలను పరిశీలించడంతో కీలక పాత్ర వహిస్తుంది. ఇప్పుడు అటువంటి పదవిని ఉపయోగించే టీడీపీ నేత పయ్యావుల కేశవ్ వైఎస్సార్ కాంగ్రెస్ ను ఏపీలో ఇబ్బంది పెడుతున్నారు.
ఒకవేళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న బడ్జెటేతర అప్పుల మీద దృష్టి సారించిన నేపథ్యంలో కేంద్రం పై నిఘా పెట్టే పదవి విజయసాయి రెడ్డిని వరించడం విశేషం. ఐతే సహజంగా కేంద్ర ప్రభుత్వం కు సంబంధించిన లెక్కలన్నీ పక్కాగానే ఉంటాయి.