Vijaya Sai Reddy - JD Tweet warవైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, జనసేన విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. జనసేన పోటీ చేసిందే 65 సీట్లు 88 ఎలా గెలుస్తారు అంటూ జేడీ చేసిన వ్యాఖ్యను విజయసాయి రెడ్డి ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. దీనికి జేడీ ఘాటుగా స్పందించి మీరు ఇలా దొంగ లెక్కలు వెయ్యబట్టే చాలా మంది కేసులలో ఇరుక్కున్నారు అని సమాధానం చెప్పుకొచ్చారు.

‘జేడీ గారూ, గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ పాల్ బీ ఫారాలు ‘పోగొట్టుకున్నట్టు’ గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి ‘త్యాగం’ చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి. పాపం! బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి మద్ధతు మాత్రం మీకివ్వమని తండ్రీ కొడుకులిద్దరూ కేడర్‌కు చెప్పిన విషయం నిజం కాదా జేడీ గారూ?,” అంటూ విమర్శించారు విజయ సాయి రెడ్డి.

“జేడీ గారూ, మీ నాయకుడు కుప్పం, మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదో ఒక మాట అడిగి క్లారిటీ ఇవ్వండి. 88 సీట్లు గెలుస్తారో లేదో దీన్ని బట్టే తెలిసి పోతుంది,” అంటూ ఎద్దేవా చేశారు విజయ సాయి రెడ్డి. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గానీ జేడీ లక్ష్మీనారాయణ గానీ జగన్ మోహన్ రెడ్డి పోటీ చేసిన పులివెందులలో కూడా ప్రచారం చెయ్యలేదు. అంత మాత్రాన వారిద్దరూ రహస్య మిత్రులు అన్నట్టా? చంద్రబాబు మీద కనీసం ప్రచారం కూడా చెయ్యలేని పరిస్థితులలో ఉన్న చంద్రమౌళితో నామినేషన్ వేయించారు జగన్. అంటే చంద్రబాబుకు జగన్ హెల్ప్ చేసినట్టా?