Vijaya Sai Reddy Fires on Pawan Kalyan - Naga Babuట్విట్టర్ లో వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, మెగా బ్రదర్ నాగబాబు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. విజయ సాయి రెడ్డి పవన్ కళ్యాణ్ ని ఎటాక్ చెయ్యడంతో నాగబాబు అందుకు గట్టిగానే సమాధానం చెప్పారు. ఎంపీ గారిని ఏకంగా గుంటనక్క అని సంబోధిస్తూ ఎన్నికలకు ముందు మాతో పొత్తు కోసం రాయభారం జరిపారు అంటూ బాంబు పేల్చారు.

దానికి ఈరోజు విజయసాయి రెడ్డి మరింత చెలరేగిపోయారు. “పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చింది. సిన్మాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలినోళ్లకు రాజకీయాలెందుకు? 2014లోనే మేం పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ గారు మా విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు,” అంటూ ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ అభిమానులలో చాలా మంది పవనన్నకు ప్రాణమిస్తాం… జగనన్నకు ఓటేస్తాం అంటూ 2019 ఎన్నికలలో పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. దీనితో జనసేన కేవలం ఒక్క సీటుకే పరిమితం అయ్యింది. పవన్ కళ్యాణ్ సైతం రెండు చోట్ల నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఈ వివాదం అటువంటి బ్యాచ్ ని ఇబ్బంది పెడుతుంది.

రాజకీయ విమర్శల వరకూ ఒకే… కానీ మరీ దారుణంగా నాగబాబు, పవన్ కళ్యాణ్ లను చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు అనడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ గొడవ ఎక్కువైతే వారు ఏటో ఒకవైపు తేల్చుకోవాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే… వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన చిరంజీవిని మాత్రం ‘గారు’ అని సంబోధించడం.