Vijaya -Sai Reddy Audi Leaksఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఆడియో కలకలం రేపుతోంది. విజయసాయిరెడ్డికి సంబంధించి తాజాగా ఓ ఆడియో క్లిప్పింగ్ లీకైంది. ఎన్నికలలో ఉదాసీనత పనికి రాదు అంటూ ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మోడీ తమకు సాయం చేస్తున్నారు అని ఒక పక్క ఒప్పుకుంటూనే మరో పక్క అది సరిపోదు అన్నట్టు మాట్లాడారు ఆయన. మోడీ కేసీఆర్ కు బాగా సహకరించారని కూడా ఒక సందర్భంలో చెప్పడం విశేషం.

“మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంధ్ర ప్రజలకు నిబద్దత లేదు. తెలంగాణ వారిలాగా నిబద్ధత లేదు. వాళ్ళు ఎప్పుడైతే చంద్రబాబును చూశారో వామ్మో వీళ్ళందరూ వచ్చి మళ్ళి పెత్తనం చేస్తారు అంటూ మూకుమ్మడిగా తెరాసకు ఓట్లు వేశారు. ఇక్కడ అలా కాదు. ప్రజలు కులాలవారీగా ప్రాంతాల వారీగా విడిపోయి ఉన్నారు. భయానకమైన కుల సంఘర్షణ ఉంది ఇక్కడ,” అంటూ ప్రజలను కూడా తప్పు పట్టారు. వైసీపీని సమర్థించే యువతకు ఐక్యూ లేదు. అందుకే చంద్రబాబుపై గెలుపు సులభమని వారనుకుంటున్నారు. అనడం విశేషం.

మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా ఆంధ్ర ప్రజలకు నిబద్దత లేదు అనే దాని పై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర పోలీసులను నమ్మరు… ఆంధ్రలో స్కీంలు ఆపడానికి ఢిల్లీ హై కోర్టులో కేసులు వేస్తారు… ఇక్కడ ప్రజల మీద వారి నిబద్దత మీద నమ్మకం లేదంటారు… కాకపోతే అదే ప్రజలు మాత్రం వీరికి ఓట్లు వేసి అందలం ఎక్కించాలని కోరుకుంటున్నారు. ప్రజల మీద ప్రతిపక్ష పార్టీకి ఉన్న చులకన భావానికి ఇది మరొక ఉదాహరణ అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.