Vijaya Sai Reddy visakhapatnamటీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి రోజు కనీసం రెండు మూడు ట్వీట్లు వెయ్యకుండా ఉండలేరు బహుశా. ఈరోజు కూడా ఆయన ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈసారి చంద్రబాబు ఫ్యూచర్ ప్లాన్, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై సెటైర్ వేశారు.

“పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని బాబు గారు అనుకుంటున్నారా? వయసు పెరగడం, జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట. కరోనా ఉధృతి తగ్గగానే లోకేశ్ నాయుడును ‘కాబోయే సీఎం’గా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట.” అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

దీనిపై టీడీపీ అభిమానులు విజయసాయి రెడ్డి పై విరుచుకుపడ్డారు. “చంద్రబాబు, లోకేష్ ల ఇంటి లోపలకి తొంగిచూడంటం మానేస్తే మీకే బెటర్. ఒకవేళ మీ ముఖ్యమంత్రి జగన్ అవినీతి కేసులలో జైలుకు వెళ్తే… మీ తరువాతి ముఖ్యమంత్రిగా ఎవరు అవ్వాలో ముందు నిర్ణయించుకోండి,” అంటూ ఎదురుదాడి ప్రారంభించారు.

ఈ విమర్శలు పక్కన పెడితే… లోకేష్ ని లోకేష్ నాయుడు అనడం… జగన్ ని జగన్ రెడ్డి అంటూ వ్యవహరించడం వంటి కుల ప్రస్తావనలు తగ్గిస్తే రాజకీయాలలో కొంతైనా కుళ్లు కంపు తగ్గుతుంది. అలాగే సమాజంలో కుల వైషమ్యాలు కూడా తగ్గుతాయి. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వారు ఆ సంస్కృతి మొదలుపెట్టి ఆదర్శంగా నిలిస్తే మరీ మంచిది.