లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అడిగిందే తడవుగా లెక్కకు మించిన రుణాలిచ్చేసిన బ్యాంకులు, ఇప్పుడు తలలు పట్టుకుంటున్న విషయం తెలిసిందే. మొత్తం 9 వేల కోట్ల రుణాలను ఎగవేసి మాల్యా ఎంచక్కా లండన్ చెక్కేయగా… దేశంలోని ఆయన ఆస్తులను అమ్ముకునైనా సదరు రుణాలను వసూలు చేసుకోవాలని బ్యాంకులు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు విఫల యత్నాలుగానే మిగలడం బ్యాంకు వర్గాలకు మింగుడు పడని విషయంగా మారింది.
ఈ క్రమంలో ఇప్పటికే ఓ దఫా వేలానికి పెట్టిన మాల్యా ఏవియేషన్ సంస్థ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయం ‘కింగ్ ఫిషర్ హౌస్’కు రెండో దఫా వేలం కూడా శుక్రవారం నాడు పూర్తయింది. 150 కోట్ల విలువ ఉన్న ఈ భవనాన్ని, బ్యాంకులు ఓ మెట్టు దిగి 15 కోట్ల మేర తగ్గించి 135 కోట్ల ప్రారంభ ధరగా ప్రకటించినా… సింగిల్ బిడ్డర్ కూడా ముందుకు రాకపోవడం విశేషం. దీంతో తాజాగా ముగిసిన రెండో విడత వేలంలో కూడా సదరు భవనం అమ్ముడుపోలేదు. బహుశా మాల్యా ఆస్తులంటే బిడ్డర్లు భయపడుతున్నారేమోనన్న ప్రచారం జోరుగా సాగుతోంది.